Menu

మత్తయి సువార్త 14

OTSA

1 ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని, 2 తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను; చనిపోయి మళ్ళీ బ్రతికాడు. అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని అన్నాడు. 3 హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు. 4 ఎందుకంటే అంతకుముందు యోహాను హేరోదుతో: “నీవు ఆమెను ఉంచుకోవడం న్యాయం కాదు” అని చెప్పాడు. 5 కాబట్టి హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేకపోయాడు. 6 అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది. 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు. 8 ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. 9 రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులను బట్టి తాను చేసిన ప్రమాణం కోసం ఆమె కోరినట్లు చేయమని ఆదేశించాడు. 10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. 11 వారు బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆమె తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేశారు. 13 యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడినుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు. 14 యేసు పడవ దిగి గొప్ప జనసమూహం రావడం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగాలతో ఉన్నవారిని స్వస్థపరిచారు. 15 సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కాబట్టి జనసమూహాలను పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు. 16 యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు. 17 వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు. 18 ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు. 19 వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు. 20 వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. 22 వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. 23 ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24 అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి. 25 రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. 26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు. 27 వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు. 28 పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. 29 అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. 30 కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు. 31 వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు. 32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. 33 అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు. 34 వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు. 35 అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కాబట్టి ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. 36 నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate